ఏపీలో ఏప్రిల్ 3 నుంచి ‘పది’ పరీక్షలు.. వీటిని తేవొద్దంటున్న విద్యాశాఖ కమిషనర్

  • ఏపీలో ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు
  • ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు పరీక్షలు
  • ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్‌కు 12 పేజీల సమాధాన పత్రాలు
  • మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే తర్వాతి పరీక్షకు అనుమతి నిల్
  • వదంతులు నమ్మొద్దన్న విద్యాశాఖ కమిషనర్
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ మూడో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పరీక్షలన్నీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటలకు ముగుస్తాయన్నారు. విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు వారిని పరీక్ష హాలులోకి అనుమతిస్తామన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. పరీక్ష కేంద్రాలకు మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్, కెమెరా, ఇయర్‌ఫోన్స్, స్పీకర్, స్మార్ట్‌ఫోన్, బ్లూటూత్ సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని సురేష్ కుమార్ తెలిపారు.

ఆ రెండు పరీక్షలకు 12 పేజీల సమాధాన పత్రాలు
ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్‌ పరీక్షలకు 12 పేజీలతో సమాధాన పత్రాలు వేర్వేరుగా ఉంటాయి. పరీక్ష ముందుగానే రాసేసినా సమయం పూర్తయ్యే వరకు పరీక్ష హాలులోనే ఉండాలి. విద్యార్థులు తమ రోల్ నంబరు, పేరు లాంటి వ్యక్తిగత వివరాలను సమాధాన పత్రంలో రాయకూడదు. వాటిని ఓఎంఆర్ షీటులోనే రాయాలి. విద్యార్థులు పెన్, పెన్సిల్, స్టేషనరీని వెంట తెచ్చుకోవచ్చు. పేపరు లీకేజీపై వదంతులు నమ్మొద్దని, అలాంటి ప్రచారం చేసే వారిపై చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడే విద్యార్థులను తర్వాతి పరీక్షలకు అనుమతించబోమన్నారు. పరీక్షలకు సంబంధించిన అప్‌డేట్ కోసం విద్యార్థులు తప్పనిసరిగా www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ను ప్రతిరోజూ చూస్తుండాలని సూచించారు.

Andhra Pradesh
10th Exams
10th Students

More Telugu News